టీ20 ప్రపంచకప్ 2024 విజయాన్ని అందించిన పిచ్ను తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ గెలుపుతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయానంతరం రోహిత్ శర్మ.. బార్బోడస్ వికెట్పై ఉన్న మట్టిని తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా ఆ మట్టిని తినడానికి గల కారణాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు.

'బార్బోడస్ వికెట్పై టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. కాబట్టి ఈ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయంతో పాటు మైదానాన్ని, పిచ్ను జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నా నోట్లో వేసుకున్నాను. ఈ గెలుపు క్షణాలు చాలా ప్రత్యేకమైనవి. ఎన్నో ఏళ్ల మా కల ఇక్కడ నెరవేరింది. కాబట్టి ఈ మైదానం, పిచ్ మాకు ఎంతో ప్రత్యేకం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రపంచకప్ విజయం నమ్మశక్యంగా లేదని, ఓ కలలా అనిపిస్తోందని రోహిత్ శర్మ అన్నాడు. 'ప్రపంచకప్ గెలిచామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఒక కలలా అనిపిస్తోంది. ఈ విజయానంతరం తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరం కలిసి సంబరాలు చేసుకున్నాం. ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విజయాన్ని నేను పూర్తిగా ఆస్వాదించలేదు.'అని హిట్మ్యాన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఈ ప్రపంచకప్ విజయంతో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించాలని లేకున్నా.. ఇంతకు మించిన మంచి సమయం లేదన్నాడు.