IND vs AFG: మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ నిర్ణయం వెనుక ఎలాంటి కారణం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన రోహిత్.. విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ తుది జట్టులోకి వచ్చారని చెప్పాడు.
దాంతో శుభ్మన్ గిల్, తిలక్ వర్మ ఉద్వాసనకు గురయ్యారని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏం లేదు. చిన్న బౌండరీలు కలిగిన ఈ మైదానం సహజంగానే చేజింగ్కు అనుకూలంగా ఉంటుంది. టీమ్ మీటింగ్లో ఈ మ్యాచ్ ప్రణాళికలతో పాటు గత మ్యాచ్ తప్పిదాలను చర్చించాం.

తొలి మ్యాచ్లో మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాం. కుర్రాళ్లకు స్పెషల్ రోల్స్ ఇచ్చాం. అందుకు తగ్గట్లే వారు రాణించారు. వారికి అండగా ఉంటూ స్వేచ్చగా ఆడేలా చేస్తున్నాం. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకునే వ్యూహాలు రచిస్తున్నాం. అలాగే ఫలితం సాధించడంపై కూడా ఫోకస్ పెట్టాం.
విరాట్ కోహ్లీ, జైస్వాల్ తుది జట్టులోకి రాగా.. శుభ్మన్ గిల్, తిలక్ వర్మ ఉద్వాసనకు గురయ్యారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. గజ్జలో గాయంతో యశస్వీ జైస్వాల్ తొలి టీ20కి దూరమవ్వగా.. కూతురు వామికా బర్త్ డే నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆడలేదు.
ఇక తాము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీమ్ జడ్రాన్ అన్నాడు. 'ఈ రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నమోదు చేసే ప్రయత్నం చేస్తాం. మళ్లీ టాస్ ఓడిపోయాం. టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. తొలి మ్యాచ్ అనంతరం టీమ్ తప్పిదాలపై చర్చించాం.
ప్రాక్టీస్ సెషన్లో ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేశాం. గత మ్యాచ్లో మేం బ్యాటింగ్లో సరైన ఆరంభం అందుకోలేదు. దీనిపై ప్రత్యేకంగా చర్చించాం. ఈ రోజు సరైన ఆరంభం దక్కుతుందని ఆశిస్తున్నా. రెహ్మత్ స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు.'జడ్రాన్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్థాన్: రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, నజిబుల్లా జడ్రాన్, కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజలక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.