
నాగ్పూర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో మైదానంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ రెండు గంటల 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పలుమార్లు అంపైర్లు మైదానాన్ని పరీక్షించి వాయిదా వేసారు. ప్లేయర్లకు గాయాలు కావద్దనే ఉద్దేశంతోనే ఔట్ ఫీల్డ్ పొడిగా మారే వరకు వేచిచూసారు. చివరకు మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు.
రెండు గంటల 15 నిమిషాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 8 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఏం జరుగుతుందో ఊహించలేమని, అందుకే ఫీల్డింగ్ ఎంచుకుంటున్నానని తెలిపాడు. అయితే అభిమానుల కోసమే ఈ మ్యాచ్ ఆడుతున్నామని చెప్పాడు.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులను నిరుత్సాపరచకూడదనే ఈ సవాల్కు సిద్దమయ్యామని తెలిపాడు. సాయశక్తులా విజయం కోసం కృషి చేస్తామని తెలిపిన రోహిత్ జట్టులో రెండు మార్పులు చేశామన్నాడు. ఉమేశ్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడని, భువనేశ్వర్ కుమార్ను పక్కనపెట్టి ఎక్స్ట్రా బ్యాటర్గా రిషభ్ పంత్ను తీసుకున్నామని చెప్పాడు. అదనపు బ్యాటర్తో ఆడాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. 8 ఓవర్లకు బౌలింగ్ ఆప్షన్స్ అవసరం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆరోన్ ఫించ్ సైతం తాము టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. చిన్న మ్యాచ్లో చేజింగ్ చేయడం సులువన్నాడు. ఇక తమ ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతున్నామని చెప్పిన ఫించ్ రెండు మార్పులు చేశామని తెలిపాడు. గాయంతో ఎల్లిస్ దూరం కాగా..డానియల్ సామ్స్ తుది జట్టులోకి వచ్చాడన్నాడు. సీన్ అబాట్ స్థానంలో ఇంగ్లీస్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్), పాట్ కమిట్స్, డానియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్