
సెయింట్ కిట్స్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదాన పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చి దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. గత మ్యాచ్లో పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోకుండా పవర్ ప్లేలో ధాటిగా ఆడాలనే టీమ్ వ్యూహాన్ని అమలు చేశామని రోహిత్ తెలిపాడు.
వీలైనన్ని ఎక్కువ పరుగులు పవర్ ప్లేలో చేయడమే టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పాడు. చిన్నమైదానం, సిక్స్లు అలవోకగా బాదవచ్చని భావించాం. కానీ ఈ మైదానం యావరేజ్ స్కోర్ పెద్దగా లేదనే విషయం కూడా తెలుసు.
ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చామని చెప్పిన రోహిత్.. హై రిస్క్ షాట్ను తాము అర్థం చేసుకోగలమన్నాడు. లెఫ్టార్మ్ పేసర్లకు ఇబ్బంది పడుతున్నామనే విషయం తనకు తెలియదన్నాడు. గేమ్లో ప్రతీ ఒక్క విషయంలో మెరుగవ్వాలనుకుంటున్నామన్నాడు. అయితే గత రెండు మ్యాచ్ల్లో లెఫ్టార్మ్ పేసర్లు అద్భుతంగా రాణించారని, అయితే దాన్ని తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నాడు. బౌలర్లు బౌలింగ్ చేస్తారని, షాట్స్ ఆడే క్రమంలో కొన్ని సార్లు ఔటవుతామన్నాడు.
ఇక విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. 'నిన్నటి మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ టైమ్లో వికెట్ చాలా నెమ్మదించింది. కాబట్టి గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచడమే మా లక్ష్యం. మేం పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నాం. వరుసగా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ల బలహీనతపై దెబ్బకొట్టాం. ఒబెడ్, అకీల్ అదరొట్టారు. ఒడియన్ స్మిత్ స్థానంలో మేం మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ డొమినిక్ డ్రేక్స్ను తీసుకొచ్చాం'అని పూరన్ తెలిపాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్మన్ పోవెల్, షిమ్రన్ హెట్మైర్, డేవన్ థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, డొమినిక్ డ్రేక్స్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్