
దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లోనూ టీమిండియాకు టాస్ కలిసిరాలేదు. దాంతో మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రాగా.. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వెల్లడించాడు.
శ్రీలంక జట్టు బ్యాటింగ్ విభాగం ఆధారంగానే రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకోచ్చామని రోహిత్ తెలిపాడు. శ్రీలంకలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్న నేపథ్యంలోనే అశ్విన్ను తీసుకున్నామని వెల్లడించాడు. ఇది టీమ్ ప్రణాళికని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని, పిచ్ ఏ మాత్రం మారలేదన్నాడు. బ్యాటింగ్కు అనువైన వికెట్ అని చెప్పిన రోహిత్.. స్వేచ్చగా ఆడవచ్చని తెలిపాడు. ప్రపంచకప్లో కూడా తాము ఇలానే స్వేచ్చగా ఆడేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఈ క్రమంలోనే లక్ష్యాలను కాపాడుకోవడం ఎలా అనే విషయంపై ఫోకస్ పెట్టామని చెప్పాడు. డ్యూ ప్రభావం ఉన్ననేపథ్యంలో మేం సరిగ్గా ఆడటం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ రోజు వికెట్పై గడ్డి తక్కువగా ఉందని, పూర్తిగా డ్రైగా ఉందన్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్ను తీసుకొచ్చామని తెలిపాడు.
ఇక టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనక ఇక్కడి రికార్డు నేపథ్యంలోనే ముందుగా బౌలింగ్ చేస్తున్నామని తెలిపాడు. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన జట్లే గెలిచాయన్నాడు. తమ బ్యాటర్ల అప్రోచ్ బాగుందని చెప్పిన షనక.. అదే జోరును కొనసాగిస్తామని తెలిపాడు. సపోర్టింగ్ స్టాఫ్ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్) వానిందు హసరంగా, చమికా కరుణరత్నే, మహీష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషంక