
దుబాయ్: ఇషాన్ కిషాన్ పూర్తిగా అలిసిపోవడం వల్లనే అతన్ని సూపర్ ఓవర్లో ఆడించలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్లో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 202 భారీ లక్ష్య చేధనలో టాపార్డర్ తడబడ్డా ఇషాన్ కిషాన్( 58 బంతుల్లో 2 ఫోర్లు 99), కీరన్ పొలార్డ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్) వీరోచిత పోరాటంతో మ్యాచ్ అనేక మలుపులు తిరిగి సూపర్ ఓవర్కు దారితీసింది. అయితే సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో ఆర్సీబీ అద్భుత విజయాన్నందుకుంది.
టచ్లో ఉన్న ఇషాన్ కిషాన్ను కాకుండా హార్దిక్ పాండ్యాను ఎందుకు సూపర్ ఓవర్లో పంపించారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో రోహిత్ శర్మను అడగ్గా అతను సమాధానమిచ్చాడు. ఇన్నింగ్స్ ఆసాంతం బ్యాటింగ్ చేయడంతో ఇషాన్ తీవ్రంగా అలసిపోయాడని, దాంతో భారీ షాట్లు ఆడగలిగే పాండ్యాను పంపించామన్నాడు.
'ఇదో అద్భుత మ్యాచ్. మా ఆరంభం ప్రకారం మేం అసలు ఈ గేమ్లోనే లేం. కానీ ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్ అద్భుత ఇన్నింగ్స్తో మమ్మల్ని పోటీలో నిలబెట్టారు. మేం మంచి ఆరంభాన్ని అందుకోకున్నా.. 200 పరుగులు చేస్తామనుకున్నా. ఎందుకంటే పొలార్డ్, ఇషాన్ కిషాన్ క్రీజులో ఉన్నారు కాబట్టి ఏదైనా జరగవచ్చు అని ఊహించా. ఇషాన్ గెలిపిస్తాడని భావించా. మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం.
కిషాన్ పూర్తిగా అలసిపోయాడు. సూపర్ ఓవర్ ఆడేందుకు సౌకర్యంగా లేకపోవడంతో బంతులను హిట్ చేయగల హార్దిక్ను పంపించాం. సూపర్ ఓవర్లో పరుగులు చేయకున్నా గెలుస్తామనే ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాం. అదృష్టం కలిసి వస్తే తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు దక్కవచ్చని భావించాం. కానీ దురదృష్టవశాత్తు ఫైన్లెగ్ బౌండరీతో సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారింది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించిన ఏబీడీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.