
ఫ్లోరిడా: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఊహించినట్లుగానే టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ నేపథ్యంలోనే ఆటగాళ్ల సత్తా పరీక్షించడానికే అవకాశం కల్పిస్తున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ కారణంగానే ఈ మ్యాచ్లో మూడు మార్పులు చేశామని పేర్కొన్నాడు. 'మేం కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లం. పిచ్ ఎలా ఉంటుందో అనేది తెలియదు. మేమైతే భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంటున్నాం. టీమ్ బలహీనతలను అధిగమించాల్సిన అవసరం ఉంది.
మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మేం మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఓ జట్టుగా మేం ఎలాంటి ప్రమాణాలు నెలకొల్పామో తెలుసు. కుర్రాళ్లకు అవకాశాలిస్తున్నాం. వారి ఆత్మవిశ్వాసం పెంచడం ముఖ్యం. అందుకే వీలైనన్ని అవకాశాలు ఇస్తున్నాం. వారి సత్తాను పరీక్షిస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్కు మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ జట్టులోకి రాగా.. హార్దిక్ పాండ్యా, రవి అశ్విన్, అయ్యర్ ఉద్వాసనకు గురయ్యారు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
మైదానం మొత్తం కవర్స్తో కప్పి ఉంచిన నేపథ్యంలో మాయిశ్చర్ ఉంటుందనే ఫీల్డింగ్ తీసుకున్నానని విండీస్ కెప్టెన్ పూరన్ తెలిపాడు. 'ఆరంభంలోనే భారత్ వికెట్లు తీయాలనుకుంటున్నాం. వీలైన వరకు గేమ్ను డీప్గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాం. గత కొన్నాళ్లుగా మేం గుడ్ క్రికెట్ ఆడుతున్నాం. కుర్రాళ్లంతా ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు.'అని పూరన్ తెలిపాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్,
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్మన్ పొవెల్, షిమ్రన్ హెట్మైర్, డేవన్ థోమస్, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్