అప్కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ధరించే జెర్సీని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. బుధవారం సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే విరామ సమయంలో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడైన రోహిత్.. ముఖ్య అతిథిగా హాజరై భారత జెర్సీని ఆవిష్కరించాడు.
రోహిత్ శర్మతో పాటు టీమిండియా టీ20 ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యాడు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు టీమిండియా జెర్సీ స్పాన్సర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ముగియగానే భారీ సైజ్ టీ20 ప్రపంచకప్ జెర్సీని మైదానంలో ప్రదర్శించారు. అనంతరం తిలక్ వర్మతో కలిసి రోహిత్ శర్మ ఈ జెర్సీలను బ్రాడ్కాస్టర్స్తో పాటు మీడియాకు చూపించాడు. నీలిరంగులో ఉన్న ఈ జెర్సీ.. రెండు వైపులా వైబ్రెంట్ ఆరెంజ్ ప్యానెల్స్ ఉన్నాయి. జెర్సీపై వర్టికల్ బ్లూ స్ట్రైప్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ గెలుచుకునేందుకు 15 ఏళ్ల నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పాడు.
'ఇది సుదీర్ఘ ప్రయాణం. మేం 2007లో మా తొలి ప్రపంచకప్ను గెలిచాం. ఆ తర్వాత మరో ప్రపంచకప్ గెలవడానికి 15 ఏళ్ల కంటే ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులతో ఈ ప్రయాణం సాగింది. కానీ మళ్లీ ట్రోఫీని ఎత్తడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు భారత్లో ప్రపంచకప్ జరుగుతుండటం ఉత్సాహపరిచే విషయం. భారత జట్టుకు నా మద్దతు శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయం కోసం కృషి చేస్తారని భావిస్తున్నా.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.