కుర్రాళ్లకు అవకాశాలు దక్కాలనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్నా.. మంచి ఆటగాళ్లకు అవకాశాలు దక్కాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
అంతేకాకుండా టీ20లకు వీడ్కోలు పలికేందుకు అంతకుమించిన సరైన సందర్భం లేదనిపించిందని పేర్కొన్నాడు. అంతేకానీ వయసు పెరిగిందని తప్పుకోలేదని, ఇప్పటికీ మూడు ఫార్మాట్లను సునాయసంగా ఆడగలనని తెలిపాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకగా.. అతన్ని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా గుడ్ బై చెప్పాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా కూడా టీ20ల నుంచి రిటైర్ అవుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ.. కోచ్ గంభీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గంభీర్ ఎవరికీ తల వంచడని చెప్పుకొచ్చాడు.
'టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పని చేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అయితే గంభీర్ ఎవరికీ తలవంచే మనిషి కాదు. చివరి వరకు పోరాడాలని బలంగా భావిస్తాడు. దేశం కోసం అతను ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పుడు అతనితో కలిసి పని చేస్తున్నా. అతని పర్యవేక్షణలో నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్గా నా బాధ్యత. సహచర ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీయాలి. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. ఒకరికొకరు అండగా ఉంటూ.. స్ఫూర్తి నింపుకోవడంపై దృష్టిసారించారు.
టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికేందుకు అదే సరైన సమయమని భావించాను. మూడు ఫార్మాట్లు ఆడగలిగే సత్తా ఉన్నా.. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నా. వయసు అయిపోయిందని టీ20లకు వీడ్కోలు పలకలేదు. గత 17 ఏళ్లుగా టీ20లు ఆడుతూనే ఉన్నా. మనకు చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. వారికి అవకాశం రావాల్సి ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.