ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలవాలని తాను కోరుకుంటున్నానని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రత్యర్థి ఎవరనేది అనవసరమని టీమిండియా ఫైనల్ చేరడమే ముఖ్యమన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి ప్రతీకారం అవసరం లేదని, జరిగిందేదో జరిగిపోయిందని తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ బాధలో ఆసీస్ను ఓడించాలనే మాట అన్నాడని చెప్పాడు.
అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల వన్డే సారథి హర్మన్ప్రీత్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్కమింగ్ టీ20 టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది.

హోస్ట్ జతిన్ సప్రు ఫైనల్లో ఏ జట్టును ఓడించాలనుకుంటున్నారని సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించగా.. 'అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాం'అని నవ్వుతూ బదులిచ్చాడు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రోహిత్ శర్మ గతం గతః అని, ఫైనల్లో ప్రత్యర్థి ఎవరా? అనేది అనవసరమని అభిప్రాయపడ్డాడు. 'టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నా. గతంలో జరిగిందేదో జరిగిపోయింది(వన్డే ప్రపంచకప్ ఓటమి). అదే స్టేడియంలో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని సూర్య ఎంతో బాధతో చెప్పాడు. భారత్.. ఏ జట్టుతో ఫైనల్స్ ఆడినా.. విజేతగా చూడాలని కోరుకుంటున్నా.
ఈ టోర్నీ భారత్లో జరుగుతుండటం గొప్ప విషయం. బ్రాండ్ అంబాసిడర్గా కొత్త పాత్రలో ఈ టోర్నీతో అనుబంధం కలిగి ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే 20 జట్లకు నా శుభాకాంక్షలు. వారికి మంచి అనుభూతి దక్కాలని, భారతదేశ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా.
ఈ టోర్నీ కోసం మా కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. భారత జట్టు తరఫున మైదానంలోకి దిగినప్పుడు ఆ భావోద్వేగం చాలా భిన్నంగా ఉంటుంది. సొంతగడ్డపై ఆడటం భిన్నమైన అనుభూతినిస్తోంది. ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ ప్రజల నుంచి వచ్చే మద్దతు మాత్రం అద్భుతం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.