తన చిన్నతనంలో వాంఖడే స్టేడియంలోకి అనుమతివ్వలేదని, ఇప్పుడు తన పేరిటే స్టేడియంలో స్టాండ్ ఏర్పాటు చేశారని టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తెలిపాడు. తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేశారనే విషయం తెలిసాక.. తన నోట మాట రాలేదని, ఎలా రియాక్టవ్వాలో కూడా తెలియలేదని రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన స్టాండ్వైపే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని రోహిత్ శర్మ ముందు హోస్ట్ ప్రస్తావించగా.. తాను అంతగా గుర్తించలేదన్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో తన పేరిట ఉన్న స్టాండ్ కనిపించలేదన్నాడు. అయితే తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
'కుర్రాడిగా ఈ మైదానాకి వచ్చి ఆటను ఆస్వాదించిన నాకు.. నా పేరిట స్టాండ్ పెట్టడం.. ఆ స్టాండ్ వైపు సిక్స్ కొట్టడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. నా చిన్నతనంలో స్టేడియంలోకి రాకుండా అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు నా పేరిటే ఓ స్టాండ్ ఏర్పాటు చేశారు. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నా పేరిట ఓ స్టాండ్ పెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియలేదు. వాంఖడే స్టేడియంలోనే నేను ఆటగాడిగా ఎదిగాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.