తాను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడుతామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించామని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది.
ఈ విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు.
'నాకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంటుంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్కు వస్తామో లేదో తెలియదు. కానీ నేను ఈ గడ్డపై ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు'అని రోహిత్ తెలిపాడు.

ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆస్ట్రేలియా కండిషన్స్ ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఇక్కడ రాణించడం అంత సులువు కాదు. నేను సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడలేదు. కానీ ఈ పర్యటన కోసం బాగా సిద్దమయ్యాను. మేం ఈ సిరీస్ గెలవలేకపోయాం. కానీ మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.