
బ్యాటింగ్ వైఫల్యంతోనే..
'ఇది హోరాహోరీ మ్యాచ్. బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో అద్భుతంగా పుంజుకున్నాం. 184 పరుగులు ఏ మాత్రం సరిపోవు. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను హోరాహోరీగా మార్చారు. తొలి బంతి నుంచే బౌలర్లు అదరగొట్టారు. అయితే చివర్లో కాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది.
40 ఓవర్ల వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకున్నాం. లక్ష్యాన్ని కాపాడుకునే పరుగులు మా దగ్గర లేవు. మరో 25-30 పరుగులు ఉంటే మా విజయం సులువయ్యేది. మా ఇన్నింగ్స్లో 25 ఓవర్ల అనంతరం 240-250 పరుగులు చేస్తామనిపించింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యం కాలేదు.

సాకులు వెతుక్కోవాల్సిన పని లేదు..
ఇలాంటి వికెట్లపై ఎలా ఆడాలనే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే మా ఓటమికి పిచ్ను సాకుగా చూపాల్సిన పని లేదు. ఇలాంటి వికెట్లపై మేం చాలా ఆడాం. రెండు మూడు ప్రాక్టీస్ సెషన్స్లో ఆటగాళ్లు ఎంత మెరుగవుతారనే విషయం నాకు తెలియదు. కానీ ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యం.
ఈ ఓటమి మా ఆటగాళ్లకు ఓ గుణపాఠమని మాత్రం కచ్చితంగా చెప్పగలను. తదుపరి మ్యాచ్ కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఈ తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతామని ఆశిస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది మాకు బాగా తెలుసు'అని రోహిత్ పేర్కొన్నాడు.

రాహుల్ ఒక్కడే..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కష్టంగా 9 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 73) టాప్ స్కోరర్గా నిలిచి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. షకీబ్ అల్ హసన్(5/36), ఎబాదత్ హుస్సేన్ (4/47) భారత్ పతనాన్ని శాసించారు. మెహదీ హసన్ మిరాజ్ (39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్), ముస్తాఫిజుర్ (11 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అద్భుతంగా పోరాడడంతో లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ జంట అభేద్యమైన ఆఖరి వికెట్కు 51 పరుగులు జోడించింది. లిటన్ దాస్ ( 63 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 41) రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (3/32), వాషింగ్టన్ సుందర్ (2/17) రాణించారు. మెహదీ హసన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications
