
ధర్మశాల: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాడు. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లోనూ భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అంతేకాకుండా టీ20ల్లో వరుసగా 11 విజయాన్నందుకుంది. ఇక రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. ఈ విజయాలతో కెప్టెన్గా రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సొంతగడ్డపై వరుసగా విజయాలందుకున్న తొలి కెప్టెన్గా గుర్తింపు పొందాడు. అటు బ్యాటింగ్లోనూ దుమ్మురేపి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయితే శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ చలాకీగా కనిపించాడు. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఏకంగా టీవీ కెమెరామెన్తోనే పరిహాసాలు ఆడాడు.
మ్యాచ్ సందర్భంగా కాఫీ తాగుతున్న రోహిత్ శర్మను కెమెరామెన్ జూమ్ చేసి చూపించాడు. ఇది గమనించిన హిట్ మ్యాన్ కాఫీ కావాలా నాయనా? అని అడిగాడు. కాఫీ గ్లాస్ను చూపిస్తూ.. కావాలా? అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. 'చల్లని వాతావరణం ఉండే ధర్మశాలలో కప్ కాఫీ కంటే ఇంకేం కావాలి?'అనే క్యాప్షన్తో ఈ వీడియోను ట్వీట్ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 47 నాటౌట్) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.
అనంతరం భారత్ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 నాటౌట్), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 45 నాటౌట్), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 39) మెరుపు ఇన్నింగ్స్లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.