న్యూఢిల్లీ: తన క్రికెట్ కెరీర్లో ఐదు ఘటనలను ఎప్పటికీ మరిచిపోనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు వన్డేల్లో 264 పరుగులు చేసిన సందర్భం, అరంగేట్ర టెస్ట్లోనే సెంచరీ సాధించడం, 2020-21 ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్ట్ గెలవడం, సీబీ సిరీస్లో సచిన్ టెండూల్కర్తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం తన కెరీర్లోనే బెస్ట్ మూమెంట్స్ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న రోహిత్ శర్మ.. అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గబ్బా టెస్ట్ విజయం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనదని రోహిత్ తెలిపాడు. 'గబ్బా టెస్ట్ విజయం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనది. జట్టులో 8-9 మంది ఆటగాళ్లు గాయపడగా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ప్రతికూల పరిస్థితుల్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం అసాధారణం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను 11 ఏళ్లుగా నడిపిస్తుండటం మరిచిపోలేని మధురానుభూతని రోహిత్ తెలిపాడు. ఇక 10 ఏళ్లలో కెప్టెన్గా ఐదు టైటిళ్లు గెలవడం గొప్ప అనుభూతినిస్తుందన్నాడు. సచిన్ టెండూల్కర్ తన ఆరాధ్య క్రికెటరని చెప్పిన రోహిత్ శర్మ.. ఆయనను చూసే ఓ వ్యక్తిగా.. ఆటగాడిగా ఎదగానని తెలిపాడు.
ఆయన ఆడిన విధానం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నాడు. 16 ఏళ్ల వయసులో వసీం అక్రమ్, వఖార్ యూనిస్ వంటి బౌలర్లను ఎదుర్కొవడం అసాధారణమని, సచిన్ టెండూల్కర్ ప్యాషన్, కమిట్మెంట్ తనను తీవ్రంగా ఆకట్టుకున్నాయని తెలిపాడు.
వచ్చే ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుందని, ఇక్కడకు తాను రావడానికి కూడా అదే కారణమని తెలిపాడు. ఈ మెగా టోర్నీ కోసం ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని ఆశిస్తున్నానని చెప్పిన రోహిత్.. తనకు కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగాలని ఉందని వ్యాఖ్యానించాడు.
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో ఓడిన హార్దిక్ సేన.. నేడు రాత్రి జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.