
క్రికెట్ను మిస్సవుతున్నా:
లాక్డౌన్తో క్రికెట్ను తానెంతో మిస్సవుతున్నానని రోహిత్ శర్మ మరోసారి చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం ఓ వీడియో (గతంలో సిక్సర్లు కొట్టిన వీడియో) పంచుకున్న హిట్మ్యాన్.. లాక్డౌన్ వేళ సిక్సుల మోత మోగించడం కుదరట్లేదని పేర్కొన్నాడు. 'ఇలా చేయడాన్ని మిస్సవుతున్నా' అంటూ వీడియోకి క్యాప్షన్ రాశాడు. 2 నిమిషాల ఒక సెకను ఉన్న ఈ వీడియోలో ఏకంగా 26 సిక్సర్లు ఉండటం విశేషం. దీనికి అభిమానులు సైతం అధిక సంఖ్యలో స్పందిస్తున్నారు. హిట్మ్యాన్ క్లాసిక్ సిక్సర్లు చూడడం చాలా మిస్సవుతున్నానని ఓ అభిమాని కామెంట్ చేయగా.. రోహిత్ కళాత్మకమైన ఆటను మళ్లీ చూసేందుకు వేచిచూస్తున్నానని మరో అభిమాని కామెంట్ చేశాడు.

నాలుగు నెలలుగా ఇంటికే పరిమితం:
రోహిత్ శర్మ మైదానంలో బ్యాటింగ్ చేస్తుంటే అభిమానులు అతడి సిక్సుల కోసం ఎదురుచూస్తుంటారు. బౌలర్ ఎవరైనా సునాయాసంగా బంతిని బౌండరీ దాటించగల సమర్థుడు. అలాంటి క్రికెటర్ నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమయ్యాడు. కివీస్ పర్యటన సందర్భంగా ఫిబ్రవరిలో గాయం కావడంతో ఆ పర్యటన మధ్యలోనే ఇంటికి చేరుకున్న రోహిత్.. తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్లోనైనా అలరిస్తాడనుకుంటే అది వాయిదా పడింది. దీంతో అభిమానులకు నిరీక్షణ తప్పలేదు.

యువరాజ్ మరికొంత కాలం ఆడాల్సింది:
అంతకుముందు ట్వీట్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరికొంత కాలం ఆడాల్సిందని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి బుధవారంకు ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా రోహిత్ తన సీనియర్ని గుర్తుచేసుకున్నాడు. అందులో ఇద్దరి మధ్యా అద్భుతమైన జ్ఞాపకాలున్నాయని చెప్పాడు. అలాగే యువీ మరికొంత కాలం ఆడాల్సి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశాడు. లాక్డౌన్ వల్ల దాదాపు మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన రోహిత్.. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. ఫిట్నెస్ను కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications

భారత్-శ్రీలంక పర్యటన వాయిదా!!










