ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వైజాగ్ టెస్ట్లో 209 పరుగులు చేసిన యశస్వి.. రాజ్కోట్ టెస్ట్లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 216 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం గాల్లోకి పంచ్లు ఇస్తూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఆ వెంటనే ప్రేక్షకులందరి వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్స్లు ఇచ్చాడు. అయితే ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న రోహిత్ శర్మ.. యశస్వి జైస్వాల్ సెలెబ్రేషన్స్ను ఇమిటేట్ చేశాడు.

అతనిలానే అందరి వైపు చూస్తూ.. ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్లో నవ్వులు పూసాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తమదైన శైలిలో ఎడిట్ చేసి వైరల్ చేశారు.
రాజ్కోట్ టెస్ట్లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇది అతిపెద్ద విజయం. భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు కుప్పకూలింది.