టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టును విజేతగా నిలబెట్టడంతో ఇంకొన్నాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు.
తాను వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలకడం లేదని, వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరాడు. కానీ ఎప్పటి వరకు జట్టులో కొనసాగుతాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడి రిటైర్మెంట్ తీసుకోవాలనే యోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

రోహితే కెప్టెన్..
మరోవైపు గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. ఆఖరి టెస్ట్ తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దాంతో రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసిందని, ఇంగ్లండ్ పర్యటనకు అతను దూరంగా ఉంటాడని కూడా ప్రచారం జరిగింది. జస్ప్రీత్ బుమ్రానే టీమిండియా టెస్ట్ టీమ్ నడిపిస్తాడని అంతా భావించారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నేపథ్యంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.
బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ మెరుగ్గా రాణించాడు. దాంతో ఇంకొన్నాళ్లు రోహిత్ శర్మనే టెస్ట్ కెప్టెన్గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారట.
ఫిట్నెస్పై ఫోకస్..
మరోవైపు 2027 వరకు ఫిట్గా ఉండేందుకు రోహిత్ శర్మ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సాయంతో రోహిత్.. ఫిట్నెస్, బ్యాటింగ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడట. 'రోహిత్ ప్రణాళికలో నాయర్ పాత్ర చాలా కీలకం. అతనికి తెలివైన కోచ్గా మంచి పేరు ఉంది. అభిషేక్ నాయర్కు లెటెస్ట్ బ్యాటింగ్ టెక్నిక్, స్టైల్ బాగా తెలుసు. కేఎల్ రాహుల్ సహా భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు అతని సహకారం తీసుకున్నారు.'అని రోహిత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.