Rohit Sharma, IND vs NZ 1st semi-final: పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినా ప్రశాంతంగా ఉండటం తమ విజయానికి కలిసొచ్చిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ(Rohit Sharma).. న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ భయపెట్టారని తెలిపాడు. అసాధారణ బ్యాటింగ్తో తమ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారని చెప్పాడు. 'వాంఖడే మైదానంలో నేను సుదీర్ఘ కాలంగా ఆడుతున్నా. ఈ మైదానంలో ఎంత భారీ స్కోర్ చేసినా.. రిలాక్స్గా ఉండలేం.
విజయం కోసం చివరి వరకు పోరాడాల్సిందే. ఈ మ్యాచ్లో మాపై ఒత్తిడి ఉంటుందనేది తెలుసు. అందుకే ఫీల్డింగ్లో తప్పిదాలు చేసినా మేం ప్రశాంతంగానే ఉన్నాం. ఆటలో ఇవన్నీ జరగడం సహజమే. అయితే ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. మా లక్ష్యానికి 30-40 పరుగులు తక్కువ చేసుంటే.. విజయం కష్టమయ్యేదా? అంటే చెప్పడం కష్టం.
ఆ పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రిస్కీ షాట్స్ ఆడేవారు కాదు. ఏది ఏమైనా విలియమ్సన్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ధాటిగా ఆడినా మేం ప్రశాంతంగానే ఉన్నాం. అలా ఉండటం మాకు చాలా ముఖ్యం. ప్రేక్షకులు కూడా సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఒక్క క్యాచ్ పట్టినా.. రనౌట్ చేసినా మ్యాచ్పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు.
మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్లోనే ఉన్నారు. ముఖ్యంగా టాప్-5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్తో చెలరేగుతున్నారు. అవకాశం దక్కిన ప్రతీసారి సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో అయ్యర్ రాణిస్తున్న విధానం చూడ ముచ్చటగా ఉంది. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
దురదృష్టవశాత్తు అతను క్రాంప్స్తో మైదానం వీడాల్సి వచ్చింది. కోహ్లీ ఎప్పటిలానే చెలరేగాడు. ల్యాండ్ మార్క్ సెంచరీతో సత్తా చాటాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో మేం 230 పరుగులే చేశాం. బౌలర్లు కొత్త బంతితో సత్తా చాటి అసాధారణ విజయాన్ని అందించారు. సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం. ఎక్కడ ఆడిన ఒత్తిడి ఉంటుంది.
సెమీఫైనల్ వంటి మ్యాచ్ల్లో ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. లీగ్ దశలో 9 మ్యాచ్లు ఎలా ఆడామో అలానే నాకౌట్ మ్యాచ్ల్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.