అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వాస్తవానికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత భారత ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచే టీమిండియాకు చివరి వన్డే. ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా ఆటగాళ్లు బిజీగా గడిపారు.
వెస్టిండీస్ పర్యటనలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమవడంతో ఒక స్థానాన్ని కోల్పోయాడు. దాంతో రోహిత్ శర్మకు రెండో ర్యాంక్ దక్కింది. 784 రేటింగ్ పాయింట్స్తో గిల్ టాప్లో కొనసాగుతుండగా.. 756 పాయింట్లతో రోహిత్, 751 పాయింట్లతో బాబర్ ఆజామ్, 736 పాయింట్లతో కోహ్లీ టాప్-4లో వరుసగా నిలిచారు. 704 రేటింగ్ పాయింట్స్తో శ్రేయస్ అయ్యర్ తన 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమ్ వైజ్ ర్యాంక్స్లో భారత తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. జడేజా తన 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ ఒక్కో స్థానం దిగజారి 14, 15వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

టీమిండియాకు ఇప్పట్లో వన్డే సిరీస్లు లేవు. బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉండగా.. ఇది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాంతో ఆస్ట్రేలియా పర్యటన వరకు టీమిండియాకు వన్డే సిరీస్లు లేవు. టీ20లతో పాటు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటనతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నాహకాలు ప్రారంభించాడు. వ్యక్తిగత కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి జిమ్ సెషన్లో పాల్గొన్నాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.