
త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేస్తూ..
టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అలియాస్ రఘుతో ఎక్కువ బౌన్స్ అవుతున్న త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. సౌతాఫ్రికా పేసర్లు రబడా, అన్రిచ్ నోర్జ్, ఎంగిడిని ఫేస్ చేసేందుకు రఘుతో త్రో డౌన్స్ వేయించుకున్నాడు. అయితే రఘు వేసిన ఓ త్రో డౌన్ రోహిత్ శర్మ గ్లౌవ్స్ను బలంగా తాకింది. దాంతో హిట్మ్యాన్ నొప్పితో విలవిలలాడాడు. ఆ వెంటనే ప్రాక్టీస్ ముగించాడు. అయితే అతని గాయంపై క్లారిటీ లేనప్పటికీ.. అనంతరం మైదానానికి వచ్చిన ఫ్యాన్స్కు బౌతిక దూరం పాటిస్తూనే సెల్ఫీలు ఇచ్చాడు.

గాయం పెద్దదైతే..
ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్కు హిట్ మ్యాన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చివరగా ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో రోహిత్ సూపర్ పెర్పామెన్స్ చేశాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్సీతో బాధ్యత మరింత పెరగడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. ఆ క్రమంలోనే బ్యాటింగ్పై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. అయితే తాజా గాయం అటు భారత జట్టుతో పాటు అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతానికి అయితే గాయం పెద్దగా అయినట్లు కనిపించడం లేదు. ఒక వేల ఇంజ్యూరీ పెద్దగా అయితే మాత్రం హిట్ మ్యాన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. 2016లో ఇంగ్లండ్తో ముంబై టెస్ట్కు ముందు ఇదే రఘు త్రో డౌన్కు అజింక్యా రహానే వేలు విరిగింది. ఆ క్రమంలోనే టీమ్మేనేజ్మెంట్ రోహిత్ గాయంపై కలవరపడుతోంది.

చెమటోడుస్తున్న రహానే
మరోవైపు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురైన అజింక్యా రహానే నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఇటీవల ముంబై వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో తొడ కండరాల గాయంతో జట్టులో చోటు కోల్పోయాడు. కెరీర్ పరంగా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న రహానేకు సౌతాఫ్రికా పర్యటన లిట్మస్ టెస్ట్లాంటింది. రాణిస్తే కెరీర్ కొనసాగుతుంది. లేదంటే ఎండ్ కార్డ్ పడినట్లే. దాంతో బ్యాటింగ్పై రహానే ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఇక జిమ్ సెషన్లో తొడకండరాలు పట్టేయడంతో రిషభ్ పంత్.. వార్మప్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక శార్దూల్ ఠాకూర్.. కేఎల్ రాహుల్కు బౌలింగ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు.

డిసెంబర్ 16 పయనం..
ఈ రోజు సాయంత్రం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు బయో బుబల్లోకి వెళ్లనుంది. డిసెంబర్ 16న ప్రత్యేక విమానంలో జోహెన్నస్బర్గ్కు బయల్దేరనుంది. ఈ నెల 26 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్ట్లు, 3 వన్డేలు ఆడనుంది. ఇక సౌతాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా కఠిన బయో బబుల్ ఆంక్షల మధ్య ఈ సిరీస్లు ఆడనుంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది లేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.


Click it and Unblock the Notifications
