రోహిత్ చేతికి బంతి
చెన్నై టెస్టులో రెండో రోజు భారత బౌలర్లు తేలిపోయారు. కెప్టెన్ జో రూట్ భారత జట్టుకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్తో పాటు షాబాజ్ నదీమ్ని కూడా స్వేచ్ఛగా ఎదుర్కొన్నాడు. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలను అయితే ఓ ఆటాడుకున్నాడు. దీంతో చెపాక్లో అతడిని ఔట్ చేయడానికి కోహ్లీసేన ఎన్నో కష్టాలు పడింది. ఇక చేసేదిలేక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయోగాత్మకంగా పార్ట్టైమర్ రోహిత్ శర్మ చేతికి బంతిని ఇచ్చాడు. టీ విరామానికి ముందు రోహిత్తో ఓ రెండు ఓవర్లు బౌలింగ్ వేయించాడు. రెండు ఓవర్లలో 7 పరుగులిచ్చాడు.

హర్భజన్లా బౌలింగ్
విరాట్ కోహ్లీ నుంచి బంతి అందుకున్న రోహిత్ శర్మను వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్ సరదాగా ఓ కోరిక కోరాడు. 'రోహిత్ భయ్యా.. భజ్జీ (హర్భజన్ సింగ్)లా బౌలింగ్ చేయ్' అంటూ గట్టిగా అరిచాడు. 'అలాగే సార్' అంటూ రోహిత్ బదులిచ్చాడు. రెండో ఓవర్ చివరి బంతిని అచ్చం హర్భజన్ శైలిలో ఆఫ్స్పిన్ వేశాడు. తొలుత నమ్మలేనట్లు చూసిన జో రూట్.. బంతి ఫుల్టాస్ పడడంతో సింగిల్ తీశాడు. అలా పంత్కిచ్చిన మాటను రోహిత్ నెరవేర్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. తొలుత స్పిన్నర్గా కెరీర్ ప్రారంభించిన రోహిత్.. ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్పై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే.

హెల్మెట్ పెట్టుకొని
తొలిరోజు కూడా రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో రోహిత్ హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేశాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా.. ఆ తరువాత అతడి ప్రవర్తనను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్లో ఉన్న అజింక్య రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు.

8 వికెట్లకు 555 పరుగులు
భారత్తో తొలి టెస్టు రెండో రోజూ ఆటలోనూ ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న కెప్టెన్ జో రూట్ (218: 377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపాడు. శనివారం ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్లో 180 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 8 వికెట్లకు 555 పరుగులు చేసింది.ప్రస్తుతం డొమినిక్ బెస్ (28), జాక్ లీచ్ (6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ నదీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
తేలిపోయిన భారత బౌలర్లు.. రూట్ డబుల్ సెంచరీ! రెండో రోజూ ఇంగ్లండ్దే పైచేయి!!


Click it and Unblock the Notifications












