మానసికంగా అలసిపోవడంతోనే టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికినట్లు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు. ఐదు రోజుల పాటు టెస్ట్ క్రికెట్ ఆడటం మానసికంగా సవాల్తో కూడుకున్న విషయమని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి వర కు ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్దమైన రోహిత్.. ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రోహిత్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో అనేక సందేహాలు తెరపైకి వచ్చాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సూచనలతోనే ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. రోహిత్, కోహ్లీ మాత్రం తమ టెస్ట్ రిటైర్మెంట్కు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా కష్టమని, మానసికంగా చాలా అలసిపోతామని వ్యాఖ్యానించాడు. తన రిటైర్మెంట్ గల కారణం ఇదేనని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. 'టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపిక అవసరం. ఐదు రోజుల పాటు ఆడాలి. మానసికంగా అది చాలా కష్టం. అలసట కూడా కలుగుతుంది.

ముంబైలో క్లబ్ మ్యాచ్లు కూడా రెండు, మూడు రోజుల పాటు జరుగుతాయి. మాకు చిన్న వయసు నుంచే సుదీర్ఘ ఫార్మాట్ ఆడటం అలవాటైంది. ఈ ఫార్మాట్ క్రికెట్లో కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆ క్లబ్ మ్యాచ్లు నేర్పించాయి.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.రోహిత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మానసిక అలసట వల్లే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడనే అభిప్రాయం కలుగుతోంది. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఇదే కారణంతో రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడని రవి శాస్త్రి తెలిపాడు.
వైట్బాల్ ఫార్మాట్ మాదిరి టెస్ట్ క్రికెట్లో రోహిత్ సక్సెస్ కాలేకపోయాడు. 2013లో అరంగేట్రం చేసిన రోహిత్..తొలి మ్యాచ్లోనే శతకం సాధించాడు. 60 మ్యాచ్లు ఆడి 45.10 సగటుతో 4374 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆఖరి మ్యాచ్ ఆడాడు. పేలవ ఫామ్తో ఆఖరి మ్యాచ్ నుంచి రోహిత్ స్వయంగా తప్పుకున్నాడు.