
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఓ అభిమానికి షాకిచ్చాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డే కోసం విశాఖ పట్నం వచ్చిన రోహిత్ శర్మ.. విమానాశ్రయంలో ఓ అభిమానిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. రోహిత్ మాటలతో సదరు అభిమాని ఉక్కిరిబిక్కిరయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే.. బామ్మర్ది పెళ్లి కారణంగా తొలి వన్డే ఆడని రోహిత్ శర్మ.. వైజాగ్ వేదికగా జరిగిన రెండో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. జట్టు సభ్యులతో కలిసి శనివారమే రోహిత్ శర్మ వైజాగ్ విమానాశ్రయంలో దిగాడు. ఆటగాళ్లంతా బయటకు వస్తుండగా.. ఓ అభిమాని వారిని ఫాలో అవుతూ.. ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. సదరు అభిమాని దగ్గరకు వెళ్లి తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. 'తీసుకో.. ఇది నీ కోసమే.. నన్ను పెళ్లి చేసుకుంటావా.' అని సరదాగా ప్రవ్నించాడు. రోహిత్ తనను పలకరించినందుకు సంతోషించిన ఆ అభిమాని.. ఆ ప్రపోజల్కు మాత్రం కాస్త షాక్ అయ్యాడు. విమానాశ్రయంలో టీమిండియాకు స్వాగతం పలుకుతూ ఇచ్చిన గులాబీ పువ్వులను రోహిత్.. ఆ అభిమానికి ఇచ్చాడు.
అయితే ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ భాయ్.. ఈ ప్రపోజ్ వదిన చూస్తే నీ వీపు మోత మోగిస్తదని సెటైర్లు పేల్చుతున్నారు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. పేలవ బ్యాటింగ్తో 117 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా పిచ్పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ ఉండి బ్యాటింగ్కు కష్టమైంది. అనూహ్య బౌన్స్, టర్న్తో భారత ఆటగాళ్లు ఇబ్బంద పడ్డారు.
ఆస్ట్రేలియా మాత్రం వికెట్ కోల్పోకుండా 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి 234 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(61 నాటౌట్), మిచెల్ మార్ష్(66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. చివరి వన్డే బుధవారం చెన్నై వేదికగా జరగనుంది.