Rohit Sharma, IND vs SA: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఓ ఛాంపియన్ ప్లేయరని, కఠిన పరిస్థితుల్లో కూడా బ్యాటింగ్ చేయగలడని కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా భారీ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలను ప్రశంసించాడు. పిచ్ ఏ మాత్రం బ్యాటింగ్కు అనుకూలంగా లేదని, ఈ తరహా పరిస్థితుల్లో కోహ్లీ లాంటి అనుభవం కలిగిన బ్యాటర్ చివరి వరకు ఆడటం చాలా ముఖ్యమని తెలిపాడు.

జట్టులో సీనియర్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ నుంచి తాము ఆశిస్తున్నది కూడా ఇదేనన్నాడు. 'చివరి మూడు మ్యాచ్ల్లో మేం మెరుగైన ప్రదర్శన చేశాం. పరిస్థితులను అద్భుతంగా అందిపుచ్చుకున్నాం. మా ప్రదర్శనను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఇంగ్లండ్తో మేం ఒత్తిడికి లోనైనా.. పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం.
అనంతరం మా పేసర్లు తమ పనిని పూర్తి చేశారు. శ్రీలంకతో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా.. ఇతర బ్యాటర్లు రాణించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. దాంతో మా బౌలర్లు మరోసారి చెలరేగారు. మా చివరి రెండు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
ఈ రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేదు. ఇలాంటప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడే కోహ్లీ లాంటి బ్యాటర్ అవసరం. కోహ్లీ నుంచి మేం ఆశిస్తున్నది కూడా ఇదే. విరాట్ ఒక ఛాంపియన్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను రాణించగలడు. శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
అతనిపై నాకు ఎప్పటికీ నాకు నమ్మకం ఉంటుంది. విరాట్ కోహ్లీ, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం మాకు భారీ లక్ష్యాన్ని అందించింది. మహమ్మద్ షమీ రీఎంట్రీతో మా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. స్కోర్ బోర్డుపై పరుగులు ఉంటే మా బౌలర్లు చెలరేగుతారనే విషయం మాకు తెలుసు. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేస్తారు.
రవీంద్ర జడేజా మా జట్టులో ఎంత కీలకమో మరోసారి తెలుసొచ్చింది. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో అతను మాకు మ్యాచ్ విన్నర్. చివరి ఓవర్లలో కీలకమైన పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. నేను ఎప్పుడూ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై క్లారిటీ ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/33) ఐదు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించాడు.