IND vs ENG: బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సిక్సర్ కొట్టిన టీమిండియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. తమకు తాము పెట్టుకున్న పరీక్షలో నెగ్గామని తెలిపాడు. 'మా అసలు సత్తా ఏంటో తెలియజేసిన మ్యాచ్ ఇది. అనుభవం కలిగిన ఆటగాళ్లంతా సరైన సమయంలో సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో మేం తొలి ఐదు మ్యాచ్ల్లో చేజింగ్ చేసి విజయం సాధించాం. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి మాకు మేం పరీక్ష పెట్టుకున్నాం.

పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందని మాకు తెలుసు. అలాగే అనుభవం కలిగిన బౌలర్లు మా జట్టులో ఉండటంతో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. అయితే బ్యాటింగ్లో మేం గొప్ప ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం సమంజసం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ భాగస్వామ్యం నమోదు చేయాల్సి ఉంటుంది. మేం అదే చేశాం.
కానీ ఆ తర్వాత మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయాం. నేను కూడా ఔటయ్యాను. ఓవరాల్గా మేం 30 పరుగులు తక్కువ చేసామని నేను అనుకున్నా. కానీ మా పేసర్లు కండిషన్స్ను ఉపయోగించుకొని బంతితో నిప్పులు చెరిగారు. ముందుగా స్వింగ్తో తర్వాత మూమెంట్తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మా బౌలింగ్ విభాగంలో అన్ని వెరైటీలు ఉన్నాయి. మా జట్టు బ్యాలెన్స్గా ఉంది. స్పిన్నర్లు, పేసర్లు తమ అనుభవంతో సత్తా చాటుతున్నారు.
ఈ తరహా బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు బ్యాటర్లు కూడా రాణించి వారికి సహకరించాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ(4/22), జస్ప్రీత్ బుమ్రా(3/32), కుల్దీప్ యాదవ్(2/24) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజా(1/16)కు ఓ వికెట్ దక్కింది. సంచలన బౌలింగ్తో 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) టాప్ స్కోరర్గా నిలిచాడు.