టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ(4) దారుణంగా విఫలమయ్యాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్లో నాలుగోసారి ఔటయ్యాడు.
కీలక టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను కలవరపెడుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్లో పర్వాలేదనిపించిన రోహిత్.. సెకండాఫ్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్ల్లో 34 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ గణంకాలను చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ శర్మ ఫామ్ కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. తొలి 7 ఇన్నింగ్స్ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్ల్లో 34 రన్సే చేశాడు. అతను మంచి ముగింపు అందుకోవాల్సిన అవసరం ఉంది.'అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.
ఇక టీ20 ప్రపంచకప్ల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డ్ లేని రోహిత్ పేలవ ప్రదర్శనను చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెరీర్లో చివరి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న రోహిత్ శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మను టీ20 ప్రపంచకప్కు కూడా ఎంపిక చేసేవారు కాదని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు.