
కోల్కతా: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుపై టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్తో కోల్కతా వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో సూర్య చాలా నిర్లక్ష్యంగా ఆడుతూ ఔటయ్యాడు. ఈ మ్యాచ్లోనూ టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. గత మ్యాచ్లకు భిన్నంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్లు ఇషాన్ కిషన్(29), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. 69 పరుగుల జోడించిన అనంతరం సాంట్నర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఔటవ్వగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా ఆడాడు. వికెట్ కోల్పోయిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ లైఫ్ను కూడా అందుకున్నాడు. అయినా అదే దూకుడు కనబర్చి గప్టిల్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు.
ఇలా వచ్చిరావడంతోనే సూర్య ఔటవ్వడంతో రోహిత్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. సూర్యవైపు చూస్తూ... ఏం ఆటరా? అని కన్నెర్ర చేశాడు. రోహిత్ రియాక్షన్తో అతని అసహనం స్పష్టంగా కనిపించింది. సాంట్నర్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి ఇషాన్ కిషన్(29) కీపర్ క్యాచ్గా వెనుదిరగ్గా.. అదే ఓవర్ చివరి బంతి సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాడు. అయితే సూర్య ఆడిన నాలుగు బంతుల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐదో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సాంట్నర్ వేసిన ఫుల్ అండ్ వైడ్ బాల్ను సూర్య ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. సరిగ్గా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ ముందు పడింది. దాంతో సూర్య ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతికే ఫార్వార్ట్ ఫీల్డర్ గప్టిల్ సూపర్ డైవ్కు వెనుదిరిగాడు. దాంతో రోహిత్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ప్రస్తుతం రోహిత్ రియాక్షన్ నెట్టింట వైరల్గా మారింది.
సూర్య ఔటైన వెంటనే రిషభ్ పంత్(4) సైతం పెవిలియన్ చేరాడు. అయితే సాంట్నర్ వేసిన 11వ ఓవర్లో బౌండరీ, క్విక్ డబుల్ తీసిన రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఇష్ సోదీ బౌలింగ్లో అతని స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్కు వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఉండగా.. 15 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 134 రన్స్ చేసింది.