
రాంచీ: ప్రశాంతంగా ఉండే టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కోపాద్రిక్తుడయ్యాడు. సహచర ఆటగాడు వికెట్ కీపర్ రిషభ్ పంత్పై కన్నెర్ర చేశాడు. వికెట్ల వెనుకాల అలసత్వంగా ఉన్న పంత్ను హిట్మ్యాన్ మందలించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్బంగా భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతిని జిమ్మీ నీషమ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్పై వచ్చి బాల్.. నీషమ్ బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ పంత్ చేతిలో పడింది. అయితే క్యాచ్ అందుకున్న పంత్ అప్పీల్ చేయకుండా సైలెంట్గా చేయికి పైకెత్తుతూ ఔటని సైగ చేశాడు. భువీ అప్పీల్ చేయగా... అంపైర్ స్పందించలేదు.
కానీ నీషమ్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించకముందే పెవిలియన్ బాట పట్టాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ నోరు లేదా? అప్పీల్ ఎందుకు చేయలేదని మందలించినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది. అయితే ఇక్కడ రిషభ్ పంత్ది కూడా పెద్దగా తప్పులేదు. సింపుల్ ఔటనే ఉద్దేశంతో అతను అప్పీల్ చేయలేదు. కానీ అంపైరే చురుకుగా కనిపించలేదు. అయితే జిమ్మీ నీషమ్ మంచి క్రీడా స్పూర్తి కనబర్చడంతో భారత్.. రివ్యూ తీసుకునే పరిస్థితి రాలేదు. కామెంటేర్లు సైతం.. పంత్పై రోహిత్ సీరియస్ అవుతున్నాడంటూ చెప్పుకొచ్చారు.
మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. మార్టిన్ గప్టిల్(31), డారిల్ మిచెల్(31), గ్లేన్ ఫిలిప్స్(34) పర్వాలేదనిపించారు. ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్తో ఓ దశలో 190+ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్ను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, స్పిన్నర్లు అదరగొట్టారు. బౌలింగ్కు ప్రతీకూలంగా మారిన వికెట్పై దుమ్మురేపారు. హర్షల్ పటేల్ అయితే తన ఐపీఎల్ మ్యాజిక్ను అరంగేట్ర మ్యాచ్లోనూ రిపీట్ చేశాడు. కీలక రెండు వికెట్ల తీయడంతో పాటు స్లాగ్ ఓవర్లో పరుగులివ్వకుండా తన మార్క్ చూపించాడు. హర్షల్తో పాటు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీయడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.