టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జైస్వాల్ క్రమశిక్షణ రాహిత్యాన్ని మందలించాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ను గెలిచిన టీమిండియా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఓటమిపాలైంది.
శనివారం నుంచి గబ్బా మైదానం వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియా సిద్దమవుతోంది. అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు జట్టులోని ఆటగాళ్లంతా సిద్దమవ్వగా.. యశస్వి జైస్వాల్ అలసత్వంగా వ్యవహరించడం ఇబ్బందిగా మారింది.

చికాకు పెట్టిన నితీష్ కుమార్ రెడ్డి..
టీమ్ ఫ్లైట్ టైమ్ ఉదయం 10.30 గంటలకు ఉండగా.. టీమ్ హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరాలని నిర్ణయించారు. దాంతో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్.. అందరూ నిర్ణీత సమయంలోపు బస్సెక్కారు.
ఇక బస్సు కదులుతుందనగా.. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన వస్తువులు కొన్ని హోటల్ గదిలోనే మర్చిపోయినట్లు చెప్పి బస్సుదిగాడు. దాంతో 10 నిమిషాలు ఆలస్యమవ్వగా అందరూ చికాకు గురయ్యారు.
ఒక ఆటగాడు మిస్సింగ్..
నితీష్ కుమార్ రెడ్డి తిరిగొచ్చిన తర్వాత బస్సు కదిలేందుకు సిద్దమవ్వగా.. టీమిండియా సెక్యూరిటీ ఆఫిసర్ అన్షుమన్ ఉపద్యాయ్ ఒక ఆటగాడు తక్కువగా ఉన్నాడని గుర్తించాడు. దాంతో బస్సు కదిలేందుకు అతను అంగీకరించలేదు. వెంటనే టీమ్ మేనేజ్ర్తో కలిసి ఉపద్యాయ్ హోటల్ రూమ్కు పరుగెత్తారు. దాంతో మరో 20 నిమిషాలు ఆలస్యమైంది.
తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ బస్సు దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. టీమ్ అధికారులతో చర్చలు జరిపిన రోహిత్ శర్మ.. బస్సును స్టార్ట్ చేయాలని, ఎయిర్పోర్ట్కు నిర్ణీత సమయంలోపు చేర్చాలని ఆదేశించాడు.

మందలించిన రోహిత్..
మరోవైపు బస్సెక్కని ఆటగాడు యశస్వి జైస్వాల్ అని ఉపద్యాయ్, టీమ్ మేనేజర్ గుర్తించారు. ఈ ముగ్గురు మరో వాహనంలో ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన యశస్వి జైస్వాల్ను రోహిత్ మందలించాడు. క్రమశిక్షణతో నడుచుకోవాలని చివాట్లు పెట్టాడు. యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినా.. ఫ్లైట్ సమయానికి జట్టుతో కలవడంతో అందరూ బ్రిస్బేన్ చేరుకున్నారు.
వ్యక్తిగత పనులతో జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ మాత్రం జట్టుతో కాకుండా వేరుగా బ్రిస్బేన్కు చేరుకున్నారు. తమ వ్యక్తిగత పనుల కోసం జట్టుకు ఇబ్బంది కలిగించవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిస్బేన్లోనే వారు నేరుగా జట్టుతో కలిసారు