ఐపీఎల్ 2026 సీజన్లో శుభారంభం చేయడంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, ఒళ్లు దగ్గర పెట్టుకొని ఇదే జోరును కొనసాగిద్దామని సహచర ఆటగాళ్లకు సూచించాడు.
కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. చివరిసారిగా 2012లో గెలిచిన ముంబై ఇండియన్స్ గత 13 సీజన్లలో తొలి మ్యాచ్ గెలవలేకపోయింది. ఈ చెత్త రికార్డ్కు తాజా సీజన్తో ముగింపు పలికింది.
ర్యాన్ రికెల్టన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 81), రోహిత్ శర్మ(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) విధ్వంసకర బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్(3/39) సత్తా చాటాడు. పేలవ బౌలింగ్తో కేకేఆర్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

ఈ మ్యాచ్ అనంతరం ఈ విజయాన్ని ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో సెలెబ్రేట్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఆటగాళ్లను ప్రశంసించింది. బ్యాటింగ్లో సత్తా చాటిన రోహిత్ శర్మకు బెస్ట్ బ్యాటర్ బ్యాడ్జ్ను అందజేసింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయంతో ఉప్పొంగి పోవద్దని, ఒదిగి ఉంటూ ఇలాగే ముందుకు సాగాలని సూచించాడు.
'వెల్ డన్ బాయ్స్.. గత 13 ఏళ్లుగా మనం ఏ గెలుపు కోసం అయితే నిరీక్షించామో.. ఆ విజయం ఇప్పుడు దక్కింది. ఇప్పుడు బంతి మన కోర్టులోనే ఉంది. ఈ విజయాన్ని ఎలా వాడుకోవాలో మనకు బాగా తెలుసు. ఇప్పుడు మనలో ప్రతీ ఒక్కరు తమ వంతు పని తాము చేయాలి. కాబట్టి, దృష్టిని అటు ఇటు మళ్లించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుదాం.'అని సహచర ఆటగాళ్లకు రోహిత్ శర్మ సూచించాడు.