ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ఇంకా కోపం తగ్గడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ఫాలో చేశారు.
ఇక నుంచి జట్టుకు ఏ మాత్రం మద్దతు తెలుపమని బహిరంగంగానే ప్రకటించారు. ఇక రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం ఏ స్థాయి వరకు చేరిందంటే.. ముంబై ఇండియన్స్ ఓటమిని కోరుకునేంత. ఆ జట్టు ఓడితే సంబరాలు చేసుకునేంత కసితో ఉన్నారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ఎలిమినేటర్లో ముగిసింది.

ముంబై ఇండియన్స్ నిష్క్రమణ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో ఓడిన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ముంబై ఇండియన్స్ పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శర్మ, కర్మ అనే హ్యాష్ ట్యాగ్స్తో హల్చల్ చేస్తున్నారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్కు సరైన గుణపాఠం తగిలిందని మండిపడుతున్నారు. రోహిత్ శర్మ అభిమానుల ఉసురు తాకి ఆ జట్టు మరింత నాశనం అవుతుందని శాపనార్దాలు పెడుతున్నారు. 2008 నుంచి 2012 వరకు ఒక్క కప్పులేని ముంబైకి రోహిత్ 2013 నుంచి గత సీజన్ వరకు ఐదు టైటిళ్లు అందించాడు.
మార్చి 22 నుంచి షురూ..
అలాంటి రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా కొనసాగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ సీజన్ వరకు అయినా రోహిత్ శర్మను కెప్టెన్గా కొనసాగించాల్సిందని అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. మిగతా మ్యాచ్ల వివరాలను ఎన్నికల షెడ్యూల్ అనంతరం వెల్లడించనుంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దశల వారిగా సాగనుండటంతో ఐపీఎల్ 2024 సెకండాఫ్ను దుబాయ్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.