టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. వన్డే ఫార్మాట్లోనూ తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ 7 బంతుల్లో 2 పరుగులే చేసి క్యాచ్ ఔటయ్యాడు. అనవసర షాట్తో మూల్యం చెల్లించుకున్నాడు.
సకీబ్ మహ్మూద్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని సకీబ్ ఫుల్లర్ డెలివరీగా వేయగా.. రోహిత్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ముందుగానే షాట్ ఆడటంతో బంతి గాల్లోకి లేచింది. ఈ సునాయస క్యాచ్ను మిడాన్లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. దాంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్కు దిగుతున్నారు. 'నీకో దండం సామీ'అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. దయచేసి రిటైర్మెంట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరహా ప్రదర్శనను ఛాంపియన్స్ ట్రోఫీలో కనబరిస్తే.. లీగ్ దశ కూడా దాటమని అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యర్థి మారినా.. ఫార్మాట్ ఏదైనా రోహిత్ తడబాటు మాత్రం మారడం లేదని మండిపడుతున్నారు. రోహిత్ శర్మ జట్టుకు భారంగా మారాడని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీ లేకుంటే రోహిత్ శర్మకు జట్టులో కొనసాగేందుకు ఎలాంటి అర్హత లేదని విమర్శిస్తున్నారు. కనీసం రోహిత్ శర్మకు అయినా సిగ్గుండాలని విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఆడటంతో ఈ మ్యాచ్లో విజయం దక్కిందని లేకపోతే ఘోర పరాజయం ఎదురయ్యేదని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు.