డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతోనే మహమ్మద్ సిరాజ్ను పక్కనపెట్టామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ప్రకటించాడు. రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అజిత్ అగార్కర్.. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించాడు.
అయితే ఈ జట్టులో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కలేదు. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తీసుకున్నారు. ఈ ఎంపికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై సందేహాలు ఉండటంతోనే సిరాజ్కు బదులు అర్ష్దీప్ సింగ్ను ఎంచుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. సిరాజ్ కొత్తబంతితో రాణించినట్లు పాత బంతితో రాణించలేడని, డెత్ ఓవర్లలో ప్రభావం చూపలేడన్నాడు.

బుమ్రాపై క్లారిటీ లేకపోవడంతోనే..
'బుమ్రా ఆడుతాడా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. కాబట్టి మేం కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో సమర్థవంతంగా రాణించే బౌలర్ను తీసుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే పవర్ ప్లేతో పాటు బ్యాక్ఎండ్లో బౌలింగ్ చేయగల అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేశాం. షమీ.. కొత్త బంతితో ఎలా రాణిస్తాడో మన అందరికి తెలిసిందే.
సిరాజ్ మాత్రం కొత్త బంతితో రాణించినట్లుగా తర్వాత రాణించలేడు. పాత బంతితో పెద్దగా ప్రభావం చూపలేడు. సిరాజ్ దూరమవ్వడం దురదృష్టమే. కానీ మాకు మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లు కొత్త బంతితో పాటు మిడిల్, బ్యాక్ఎండ్లో కూడా రాణించగలరని అనుకుంటున్నా.
అనుభవం లేకున్నా..
అర్ష్దీప్ సింగ్ ఎక్కువగా వన్డేలు ఆడలేదు. కానీ సుదీర్ఘకాలంగా అతను వైట్బాల్ సెటప్లో ఉన్నాడు. అతనికి అనుభవం లేదని చెప్పడం నాకు సౌకర్యంగా లేదు. టీ20ల్లో అతను తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్ చేశాడు. వైట్బాల్ క్రికెట్లో షమీ ఓ లెజెండ్. విభిన్నమైన బౌలర్ కావాలనే హర్షిత్ను తీసుకున్నాం. అతనికి ఆ సామర్థ్యం ఉందని నిరూపించుకున్నాడు. అందుకే అతనికి అండగా నిలిచాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడే భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్
రిజర్వ్ ప్లేయర్స్: నితీష్ కుమార్ రెడ్డి, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తీ