ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన మూగ సంభాషణ అభిమానుల మనసులను గెలుచుకుంది. ఈ మ్యాచ్కే సీటిమార్ మూమెంట్గా నిలిచిపోయింది. దుబాయ్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాటకీయ పరిణామాల మధ్య బౌండరీతో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ ముంగిట.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వుతూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అసలేం జరిగిదంటే..?
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ను విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్తో నడిపించాడు. రోహిత్ శర్మ త్వరగానే ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ.. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు రిస్కీ షాట్స్ ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసి సెంచరీ దిశగా సాగాడు.
సిక్సర్ కొట్టాలని..
అయితే విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్ కావాల్సిన పరుగుల కంటే భారత విజయ సమీకరణం తక్కువగా ఉండటంతో శతకం అసాధ్యమనిపించింది. ఓ దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం కుదురదని భావించాడు. ముఖ్యంగా కుష్దీల్ వేసిన 43వ ఓవర్లో భారత్ విజయానికి 4 పరుగులు అవసరమవ్వగా.. కోహ్లీ సింగిల్ తీసాడు. రెండో బంతికి అక్షర్ పటేల్ డబుల్ తీసే అవకాశం ఉన్నా నిరాకరించి కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ ఆశ్చర్యపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడగా.. రోహిత్ నవ్వుతూ సిక్సర్తో సెంచరీ చైయాలని నవ్వుతూ సైగలు చేశాడు.
ఆ మరుసటి బంతినే కోహ్లీ బౌండరీ బాది భారత విజయ లాంఛనంతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లీ సెంచరీని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచే ఆస్వాదించాడు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో అభినందించాడు. అనంతరం మైదానంలోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నాడు. ఈ సన్నివేశాలు కోహ్లీ-రోహిత్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. సీటీమార్ మూమెంట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్లో మిమ్మల్ని ఆకట్టుకున్న సన్నివేశాలు ఏంటో కామెంట్ చేయండి.