టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ రోజు అయితే తాను ఆడలేననే ఫీలింగ్ కలుగుతోందో ఆ క్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అయితే గత మూడేళ్లుగా తాను మెరుగ్గా ఆడుతున్నానని, తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఏ రోజు అయితే నిద్రలేచిన వెంటనే క్రికెట్ ఆడేందుకు అసౌకర్యంగా ఫీలవుతానో.. క్రీడలు ఆడటానికి సరిపోను అని భావిస్తానో.. ఆ క్షణమే నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. కానీ గత రెండు, మూడేళ్లుగా నేను అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాను. నా ఆట ఎంతో మెరుగైంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రికార్డుల కోసం కాకుండా..
జట్టులో రికార్డుల కోసం కాకుండా స్వేచ్చగా ఆడే సంప్రదాయం తీసుకురావడంపై ఫోకస్ పెట్టినట్లు రోహిత్ తెలిపాడు. 'నేను గణంకాలను పట్టించుకునే వ్యక్తిని ఏ మాత్రం కాదు. భారీ పరుగులు చేయడం ముఖ్యమే. కానీ గణంకాలతో సంబంధం లేకుండా ఆడే సంప్రదాయాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నాను. ప్రతీ ఆటగాడు మైదానంలోకి వెళ్లి స్వేచ్చగా ఆడటమే నాకు కావాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
సమష్టి ప్రదర్శనతో ధర్మశాల టెస్ట్లో విజయం సాధించామని, ముఖ్యంగా కుర్రాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని రోహిత్ కొనియాడాడు. 'టెస్టు సిరీస్ గెలవాలంటే అన్ని విభాగాల్లో సత్తాచాటాలి. జట్టులో ఆటగాళ్లు వస్తుంటారు., వెళ్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు కాస్త అనుభవం తక్కువగా ఉంది. కానీ వాళ్లు ఎంతో క్రికెట్ ఆడారు. ఒత్తిడిని జయిస్తూ రాణించారు.
సమష్టి విజయం..
గెలుపు క్రెడిట్ టీమ్కు ఇవ్వాలి. ఇలా టెస్టు సిరీస్ను గెలిచినప్పుడు సెంచరీల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు సాధించాలి. బౌలర్లు వాళ్ల బాధ్యతలు గొప్పగా నిర్వర్తించడం ఎంతో సంతోషంగా ఉంది. కుల్దీప్తో మేం తరుచూగా మాట్లాడుతుంటాం. అతనికి ఎంతో సామర్థ్యం ఉంది.
తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గాయంతో కొన్నాళ్లు జట్టుకు దూరమైన కుల్దీప్ ఎంతో కష్టపడ్డాడు. ఎన్సీఏలో తీవ్రంగా శ్రమించాడు. కుల్దీప్ బ్యాటింగ్లోనూ సత్తాచాటడం ఆనందంగా ఉంది. యశస్వి జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.