
15 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి..
అనూహ్యంగా భారత జట్టులోకి వచ్చిన వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 37 ఏళ్ల దినేశ్ కార్తీక్, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండున్నరేళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆర్సీబీతో సంచలన ప్రదర్శన కనబర్చి జట్టులోకి వచ్చిన అతను రోహిత్ శర్మతో కలిసి 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2007లో అండర్ డాగ్స్గా బరిలో దిగిన భారత జట్టులో ఈ ఇద్దరు బరిలోకి దిగారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడిన ధోనీ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్గా నిలిచింది.

కార్తీక్, రోహిత్ ఇద్దరే..
ఈ టోర్నీ తర్వాత ఆరు టీ20 ప్రపంచకప్లు జరిగినా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కలిసి ఆడింది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగబోతున్నారు. దీంతో మళ్లీ 2007 టీ20 వరల్డ్ కప్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఈ సెంటిమెంట్ భారత జట్టుకు కలిసి వస్తుందా? అని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు. చావ్లా, ఊతప్ప రిటైర్మెంట్ తీసుకోకపోయినా జట్టుకు ఏనాడో దూరమయ్యారు.

కార్తీక్ సంతోషం..
35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టును నడిపించబోతుంటే, 37 ఏళ్ల దినేశ్ కార్తీక్... ఫినిషర్ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నాడు. గతేడాది క్రికెట్ కామెంటేటర్గా మారిన దినేశ్ కార్తీక్, 2022లో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తానని, ఏకంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమ్లోనే చోటు దక్కించుకుంటానని కలలో కూడా ఊహించి ఉండడేమో... అందుకే టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కడంపై 'కల నిజమైందంటూ'అంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












