
దుబాయ్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లకు సంబంధించిన ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్న కెప్టెన్గా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని అందుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా వన్డే, టెస్ట్, టీ20ల్లో అగ్రస్థానాన్ని అందుకున్నా ఏక కాలంలో మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ చేరడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది న్యూజిలాండ్, శ్రీలంకలతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో సత్తా చాటి వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్న టీమిండియా.. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానం చేరింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేయడంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా అగ్రస్థానానికి చేరింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో 115 రేటింగ్ పాయింట్స్తో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా(111), ఇంగ్లండ్(106), న్యూజిలాండ్(100), సౌతాఫ్రికా(85) టాప్-5లో కొనసాగుతున్నాయి. వన్డే ర్యాంకింగ్స్లో 114 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా(112), న్యూజిలాండ్ (111), ఇంగ్లండ్(111), పాకిస్థాన్(106) టాప్-5లో ఉన్నాయి. టీ20 ర్యాంకింగ్స్లో 267 రేటింగ్ పాయింట్స్తో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్(266), పాకిస్థాన్(258), సౌతాఫ్రికా(256), న్యూజిలాండ్(252) తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఏక కాలంలో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని అందుకున్న రెండో జట్టుగా టీమిండియా నిలిచింది.
ఐసీసీ ర్యాంకింగ్స్తో ప్రపంచ క్రికెట్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోంది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో సూర్య అగ్రస్థానంలో ఉండగా.. నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్గా జడేజా కొనసాగుతున్నాడు. వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్గా సిరాజ్ కొనసాగుతుండగా.. నెంబర్ 2 టెస్ట్ బౌలర్గా అశ్విన్ ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్లో ఆసీస్ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.