న్యూఢిల్లీ: కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి భారత క్రికెటర్లు విరామం లేకుండా ఆడుతున్నారు. ప్రాణాంతక వైరస్ ముప్పు నేపథ్యంలో నెలల కొద్ది బయో బబుల్లో ఉంటూ మానసికంగా తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్కు వెళ్లిన భారత ఆటగాళ్లు.. అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అనంతరం స్వదేశానికి వచ్చి షార్ట్ బ్రేక్ తీసుకున్నా.. ఆ వెంటనే ఇంగ్లండ్తో సిరీస్లకు సన్నదమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనే యోచనలో భారత టీమ్మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా స్పెషల్ రిక్వెస్ట్తో జట్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో ఇంగ్లండ్తో గురువారం నుంచి నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్కు అతను దూరమయ్యాడు. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం మేరకు ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జట్టులోని ఆటగాళ్లకు టీమ్మేనేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చిందంట. అలాగే బయోబబుల్ కారణంగా ఎదురయ్యే మెంటల్ హెల్త్ రిస్క్పై కూడా ఆటగాళ్లకు అవగాహన కల్పించారంట. ఈ క్రమంలోనే బుమ్రా, సిరాజ్లను టీ20 సిరీస్ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో మార్చి 23, 26, 28 వ తేదీల్లో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు టీమ్మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లను టీ20 సిరీస్కు ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. కొత్తగా సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం కల్పించింది. ఇక రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా వెళ్లినా.. భవిష్యత్తు మ్యాచ్ల దృష్ట్య అతనిపై వర్క్లోడ్ తగ్గించాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలో వన్డే సిరీస్కు హిట్మ్యాన్ను దూరంగా ఉంచనున్నారు.