
సిడ్నీ: తండ్రయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని సహచర ఆటగాడు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విషెస్ చెప్పాడు. ట్విటర్ వేదికగా విరుష్కా జోడీకి అభినందనలు తెలిపాడు. విరాట్ కోహ్లీ ట్వీట్ను రీట్వీట్ చేసిన రోహిత్.. 'ఇది గొప్ప అనుభూతి. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మకు అభినందనలు. ఆ దేవుడు చల్లగా చూడాలి'అని పేర్కొన్నాడు. సోమవారం మధ్యాహ్నం అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్గా ఫీలవుతున్నాం. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లీ'అని విరాట్ ట్వీట్ చేశాడు. ఇక విరుష్క దంపతులకు అభిమానులు, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ తెలియజేశారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కూడా విషెస్ చెప్పాడు. అయితే హిట్ మ్యాన్కు కోహ్లీకి అభినందనలు తెలపడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య విబేధాలున్నాయని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అవి నిజమే అనుకునేలా చేశాయి. విరాట్ కోహ్లీ బర్త్డేకు రోహిత్ విషెస్ చెప్పకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ఎంపిక కాకపోవడం.. ఆ తర్వాత ఎంపికైనా జట్టుతో ఆసీస్కు వెళ్లకపోవడం.. అసలు రోహిత్ గురించి తనకేం తెలియదని విరాట్ మీడియా ముఖంగా చెప్పడం వీరి మధ్య విభేదాలు నిజమే అని చెప్పుకునేలా చేశాయి. కానీ తండ్రైన విరాట్కు రోహిత్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఇదంతా తాత్కలికమే.. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలిచ్చాయి.
రోహిత్ శర్మ తాజా ట్వీట్తో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. గత కొంతకాలంగా రెండుగా చీలి సోషల్ మీడియా వేదికగా తిట్టుకుంటున్న అభిమానులు.. ఈ ట్వీట్తో కుదుటపడ్డారు.