
రాంచీ: టీమిండియా టీ20 కెప్టెన్గా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో కెప్టెన్గా తన సత్తా చాటుతున్నాడు. ఫస్ట్ టీ20లో అద్భుత సారథ్యంతో తొలి విజయాన్నందుకున్న హిట్ మ్యాన్.. రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన మార్టిన్ గప్టిల్ను తనదైన కెప్టెన్సీతో బోల్తా కొట్టించాడు. బౌలింగ్ వేయకుండానే అతన్ని పెవిలియన్కు చేర్చాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే దంచి కొట్టిన మార్టిన్ గప్టిల్కు దీపక్ చాహర్తో చెక్ పెట్టాడు. అయితే అతను వేసిన ఐదో ఓవర్లో తొలి బంతిని గప్టిల్ భారీ సిక్సర్ బాదగా.. దీపక్ దగ్గరకు వెళ్లిన హిట్ మ్యాన్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా దీపక్తో కలిసి సూపర్ ప్లాన్ రచించాడు. బ్యాట్స్మన్ బ్లఫ్ చేస్తూ ఫీల్డింగ్ మార్చిన హిట్ మ్యాన్.. దీపక్ చాహర్కు స్లో బౌన్సర్ వేయాలని సూచించాడు.
ఇక కెప్టెన్ సూచనలు అలానే పాటించిన దీపక్ చాహర్.. ఊరించే స్లోయర్ బౌన్సర్ వేసి గప్టిల్ను టెంప్ట్ చేశాడు. మంచి బంతి అనుకొని పొరబడిన గప్టిల్.. భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బౌన్సర్ను గప్టిల్ తప్పుగా అంచనా వేయడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఎలాంటి తప్పిదం చేయకుండా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దాన్ని సునాయసంగా అందుకున్నాడు.
బ్యాట్స్మన్ మైండ్ సెట్ను బాగా రీడ్ చేసిన రోహిత్.. పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను మార్చి ఫలితాన్ని రాబట్టాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్తో మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్ను హర్షల్ పటేల్తో పెవిలియన్కు చేర్చాడు. అనంతరం ధాటిగా ఆడిన గ్లేన్ ఫిలిప్స్కు హర్షల్ పటేల్తో చెక్ పెట్టాడు. ఓపెనర్లు అందించిన శుభారంభంతో 190 ప్లస్ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్ రోహిత్ మార్క్ కెప్టెన్సీతో విలవిలలాడింది. స్లాగ్ ఓవర్లలో పరుగులు చేయడానికి నానా కష్టాలు పడి 6 వికెట్లకు 153 పరుగులే చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 155 రన్స్ చేసి మరో 16 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65), రోహిత్ శర్మ(36 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. వెంకటేశ్ అయ్యర్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్), రిషభ్ పంత్(6 బంతుల్లో 2 సిక్స్లతో 12 నాటౌట్) తమదైన శైలిలో మ్యాచ్ను ముగించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఇతర బౌలర్లు విఫలమయ్యారు.