కోహ్లీని తప్పించి..
ఐసీసీ టైటిల్ గెలవలేదని టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చారు. గతేడాది టీ20 ప్రపంచకప్లో టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరగడంతో ఆ వైఫల్యాన్ని విరాట్ను బాద్యుడిని చేసి అతని సారథ్యంపై బీసీసీఐ వేటు వేసింది. అదే సమయంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మొనగాడంటూ.. రోహిత్ శర్మకు నాయకత్వం అప్పజెప్పింది. సారథ్య బాధ్యతలు ఇవ్వడమే కాకుండా టీ20 ప్రపంచకప్ 2022 గెలవాలని సూచించింది. ఈ క్రమంలోనే గత 12 నెలలుగా టీమిండియా ఈ టైటిల్ కోసం శ్రమించింది.
రోహిత్ వల్లే..
ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తా చాటి తిరుగులేని జట్టుగా నిలిచింది. ఈ ఏడాది అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన జట్టుగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. దాంతో రోహిత్ శర్మ 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. టైటిల్ సాధిస్తాడని అభిమానులు కలలు కూడా కన్నారు. అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపడంతో ఈసారి టైటిల్ మనదేనని అంతా అనుకున్నారు. కానీ కీలక సెమీఫైనల్లో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారడంతో ఊహించని పరాజయం ఎదురైంది. అయితే ఈ వైఫల్యానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
చెత్త కెప్టెన్సీతో..
ఈ టోర్నీలో రోహిత్ బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. పసికూన నెదర్లాండ్స్పై హాఫ్ సెంచరీ మినహా ప్రతీ మ్యాచ్లో విఫలమయ్యాడు. కీలక సెమీస్లో 28 బంతులు ఆడి 27 పరుగులే చేశాడు. అతని జిడ్డు బ్యాటింగ్ టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. అంతేకాకుండా కెప్టెన్గా కూడా రోహిత్ చేతులెత్తేసారు. 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం దగ్గర నుంచి తుది జట్టు ఎంపిక, బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్ ఇలా అన్ని విషయాల్లో విఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒత్తిడికి గురయ్యారని, అందుకే అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయామని చెప్పాడు. కానీ ఆటగాళ్ల కంటే రోహితే ఎక్కువ ఒత్తిడిలోకనిపించాడు.
కెప్టెన్సీ వదిలేయాలని..
ఈ క్రమంలోనే రోహిత్పై అభిమానులు మండిపడుతున్నారు. వెంటనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో ఎలాంటి లోపం లేదని విషయం ఈ పరాజయంతో తెలిసొచ్చిందని, సరైన ఆటగాళ్లు లేకుంటే ఎవరూ టైటిళ్లు గెలవలేరని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ టైటిల్ గెలవడం ఐపీఎల్ గెలిచినంత సులువు కాదని, ఇక్కడ అంబానిల మద్దతు ఉండదని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ డకౌట్ అయినా జట్టుకు కలిసొచ్చేదని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












