భారత పిచ్లను నిందించే బ్రిటిష్-ఆస్ట్రేలియా మీడియాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ ఒకటిన్నర రోజులోనే ముగియగా.. టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పేస్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై పేసర్లు చెలరేగడంతో 107 ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం తేలింది.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మను ఈ వికెట్పై స్పందించమని కోరగా.. తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. భారత పిచ్లపై ఫిర్యాదు చేయకుండా ఉంటే.. తనకు ఇలాంటి వికెట్పై ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. భారత్లో మ్యాచ్ అనగానే బ్రిటీష్, ఆస్ట్రేలియా మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు స్పిన్ పిచ్లంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందే నిందలు వేస్తూ ఉంటారని విమర్శలు గుప్పించాడు.

ఇలా మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే.. పేస్ వికెట్ల గురించి కూడా తాను మాట్లాడనని తెలిపాడు. 'భారత్లో అందరూ నోరు మూసుకొని ఉండి.. భారత పిచ్లపై ఫిర్యాదు చేయనంత కాలం ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు మీరు సవాలు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చారు. అలాగే భారత్కు వచ్చినప్పుడు కూడా అలాంటి సవాలే ఎదురవుతుంది.
ఎందుకంటే మిమ్మల్ని మీరు సవాల్ చేసుకునేందుకే విదేశీ పర్యటనకు వస్తారు. అలాగే భారత్కు వచ్చే వాళ్లు కూడా ఇలాంటి సవాలే ఎదురువుతుందని గ్రహించాలి. టెస్ట్ క్రికెట్ ఆడేందుకే వచ్చినప్పుడు టెస్ట్ క్రికెట్ గురించే మాట్లాడాలి. మనం కూడా దానికే మద్దతుగా నిలవాలి.
ప్రపంచ కప్ ఫైనల్ పిచ్కు తక్కువ రేటింగ్ ఇవ్వడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒక బ్యాటర్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఆ పిచ్కు పూర్ రేటింగ్ ఎలా ఇస్తారు? భారత్లో తొలి రోజు నుంచే పిచ్పై నిందలు వేస్తారు. క్రాక్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఉంటారు.
క్రికెట్ టీమ్స్ భారత పర్యటనకు వచ్చినప్పుడు.. కళ్లు, చెవులు తెరిచి ఉంచాలి. సవాల్ చేసే పిచ్ సానుకూలతలను కూడా చూడాలి. నిజాయితీగా చెబుతున్నా ఈ తరహా పిచ్లపై ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఇలాంటి వికెట్పై ఆడటం సవాల్గా భావిస్తున్నాను. ఇలాంటి పిచ్లపై ఆడుతున్నందుకు గర్వపడుతున్నా'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.