హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లో సచిన్, ధోనీ, కోహ్లీ తర్వాత అంతే ఆదరణ కలిగిన క్రికెటర్ హిట్ మ్యాన్. టీమిండియా ఓపెనర్గా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ ఎన్నో చిరస్మరణీ ఇన్నింగ్స్లు ఆడాడు. ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలిచి అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్గాను రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్ వికెట్ తీయడంతో పాటు సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గాను రికార్డు క్రియేట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లోనూ రోహిత్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి.. ఆకాశమే హద్దుగా చెలరేగడం రోహిత్ బ్యాటింగ్ నైజం. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ నిలిచిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1987లో ఏప్రిల్ 30న జన్మించిన రోహిత్ శర్మ ఆదివారం(ఏప్రిల్ 30) 36వ జన్మదినం జరుపుకోనున్నాడు. రోహిత్ శర్మ బర్త్ డే వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు ముంబై ఇండియన్స్ ఏర్పాట్లు చేస్తుండగా.. అతని అభిమానులు కూడా తమ అభిమాన ఆటగాడికి తమదైన శైలిలో విషెస్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్లో రోహిత్ శర్మకు కోట్లలో అభిమానులున్నారు. ఇందులో రోహిత్ అంటే చాలా మంది పడిచచ్చేవారే. ఈ క్రమంలోనే వారంతా ముంబై ఇండియన్స్ను అభిమానిస్తుంటారు. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అభిమానులు.. సన్రైజర్స్ అభిమానులతో గొడవపడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
అంత పిచ్చిగా అభిమానించే హైదరాబాద్ ఫ్యాన్స్ రోహిత్ బర్త్డే వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 60 అడుగుల భారీ కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు. సుదర్శన్ థియేటర్ ముందు ఈ భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నారు. భారత్లో ఓ క్రికెటర్కి ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి.
సాధారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సినిమా హీరోల భారీ కటౌట్లు కనబడుతుంటాయి. కానీ రోహిత్ శర్మ బర్త్డే నేపత్యంలో ప్రత్యేకంగా అతని కటౌట్ను సిద్దం చేస్తున్నారు.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై సెంచరీ బాదిన తర్వాత బ్యాట్ పైకెత్తుతూ హిట్ మ్యాన్ ఇచ్చిన పోజ్ను భారీ కటౌట్గా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కటౌట్ ఏర్పాటు పనులు పూర్తవ్వగా.. బర్త్డే సందర్భంగా ఆదివారం ఆవిష్కరించనున్నారు. భారీ సంఖ్యలో రోహిత్ శర్మ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.