న్యూఢిల్లీ: భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ సునాయసంగా గెలవాల్సి ఉండగా.. వర్షం చివరి రోజు ఆటను మింగేసింది. దాంతో ఫలితం తేలకుండా ముగియగా టీమిండియా 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే వర్షం నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ విండో నుంచి రోహిత్ శర్మ ఇచ్చిన ఓ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఫొటోతో మీమర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ డ్రా అవ్వడం వల్ల టీమిండియాకు వచ్చిన నష్టం ఏం లేకపోయినా.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రభావం చూపనుంది. విన్నింగ్ పర్సంటేజ్ ఆధారంగా టాప్-2 టీమ్స్ను ఎంపిక చేయనుండగా.. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ డ్రా అవ్వడం భారత్ అవకాశాలను దెబ్బతీసినట్లే.

ఈ మ్యాచ్ డ్రా అవ్వడంతో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా సహనం కోల్పోయిన అతను మైక్ను కూడా విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడం దురదృష్టకరమని రోహిత్ తెలిపాడు.
'ప్రతి విజయం ప్రత్యేకమే. భారత్లో ఆడితే కొన్ని సవాళ్లు ఉంటాయి. ఇక్కడ ఆడినప్పుడు వేరే సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే ఇక్కడ మేం ఆడిన విధానం సంతృప్తి కలిగించింది. చివరి రోజు ఆట లేకపోవడం దురదృష్టకరం. నాలుగో రోజున మేం పాజిటివ్ ఇంటెంట్ తో ఆడాం. మ్యాచ్ లో ఫలితం కోసం పోరాడాం. విజయంపై కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.
ఈ పిచ్లో అంత పస లేదు. సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా, షమీ లేని సమయంలో అతను పేస్ ఎటాక్ను అద్భుతంగా నడిపించాడు. అయితే ఎవరో ఒకరిద్దరి మీదనే ఆధారపడటం కరెక్ట్ కాదు. మేం చక్కగా టెస్ట్ క్రికెట్ ఆడాం. ఇలాగే రాణిస్తామని అనుకుంటున్నా" అని రోహిత్ తెలిపాడు.
జూలై 27 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీమ్ కాంబినేషన్ను పరీక్షించనుంది.