టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్గా గుర్తింపు పొందాడు.

2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్గా ఉండగా రోహిత్ శర్మ అధిగమించాడు.
రోహిత్@5000
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో టాప్లో ఉండగా.. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, సౌరవ్ గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.
సిక్సర్లలో రోహిత్ హాఫ్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు బాదిన తొలి భారత బ్యాటర్గానూ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్లు బాదాడు. 63 సిక్స్లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
బాబర్ ఆజామ్ రికార్డ్ బద్దలు..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్గానూ రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ ఆజామ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్ల్లో భారత్ను గెలిపించాడు. మరోవైపు బాబర్ ఆజామ్ 85 మ్యాచ్ల్లో పాక్కు 48 విజయాలు అందించాడు.
అక్షర్, కుల్దీప్ తీన్మార్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), హార్దిక్ పాండ్యా(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23) దూకుడుగా ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.
జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.