పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో వరుసగా 30 ఇన్నింగ్స్ల్లో డబుల్ డిజిట్ స్కోర్ చేసిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు.
ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ప్లేయర్ మహేళ జయవర్దనే రికార్డును అధిగమించాడు. జయవర్దనే వరుసగా 29 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, జయవర్దనే తర్వాత ఇంగ్లండ్ మాజీ ఆటగాడు లెన్ హట్టన్(2), రోహన్ కనహారి(25), ఏబీ డివిలియర్స్(24)లు ఉన్నారు.

చివరి 30 ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 12, 161, 26, 66, 25 నాటౌట్, 49, 34, 30, 36, 12 నాటౌట్, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులు చేశాడు. అంతేకాకుండా యశస్వి జైస్వాల్తో కలిసి అత్యంత వేగంగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్ నమోదు చేశాడు.
5.5 ఓవర్లలోనే రోహిత్-యశస్వి ద్వయం 50 పరుగుల మార్క్ను అందుకుంది. భారత క్రికెట్లో ఏ జోడీకైనా ఇదే అత్యంత వేగవంతమైన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం వెస్టిండీస్ మహమ్మద్ సిరాజ్(5/60) ధాటికి 255 పరుగులకు కుప్పకూలింది. క్రెయిగ్ బ్రాత్వైట్(75) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సిరాజ్కు తోడుగా ముఖేశ్ కుమార్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ ధనాధన్ బ్యాటింగ్తో 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 181 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. యశస్వి(38), శుభ్మన్ గిల్(29) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
365 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్(28), కిర్క్ మెక్కెంజీ(0) విఫలమవ్వగా.. తేజ్నారయణ్ చంద్రపాల్(24 బ్యాటింగ్), జెర్మైన్ బ్లాక్వుడ్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.