World Cup 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. దాంతో ప్రపంచకప్ చరిత్రలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఇక వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాగా.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

ఇక బ్యాటింగ్ పరంగానూ రోహిత్ 52 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలోనే ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ(4/22), జస్ప్రీత్ బుమ్రా(3/32), కుల్దీప్ యాదవ్(2/24) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజా(1/16)కు ఓ వికెట్ దక్కింది. సంచలన బౌలింగ్తో 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు.