
మొహాలి: శ్రీలంకతో రెండు టెస్ట్ల సిరీస్ సందర్భంగా జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. అసలు విషయం ఏంటంటే.. శుక్రవారం మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభ కానున్న టెస్ట్ మ్యాచ్తో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కెరీర్లో 100వది. దాంతో ఈ టెస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం వర్చువల్గా మీడియాతో సమావేశమయ్యాడు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు బదులిచ్చాడు. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ నేపథ్యంలో అతనికి ఈ మ్యాచ్ను స్పెషల్గా మారుస్తామని తెలిపాడు. ఇదో అత్యుత్తమమైన ఘనత అంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ .. మీరు మైదానం బయట మ్యాచ్ ఆడుతున్నారా? అసలు పిచ్, టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు.
'మీలో ఒక్కరు కూడా పిచ్, క్రౌడ్, టీమ్ కాంబినేషన్స్ గురించి అడగడం లేదు. మీరు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెబుతున్నాను. అయినా మీరు ఆటకంటే మసాల వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు కదా'అనే అర్థంలో సమాధానం ఇచ్చాడు. దానికి సదరు జర్నలిస్ట్ ఎవరు అడగలేదనే నేను అడిగానని చెప్పాడు.
దీనికి రోహిత్ అతన్ని మెచ్చుకుంటూ.. ఇది అసలు సిసలు ప్రశ్న అని, ఇలాంటి అడగకపోవడం వల్లే మేం చెప్పడం లేదన్నాడు. ఇది ఒకందుకు తమకు మంచిదేనని, అన్ని విషయాల నుంచి తప్పించుకోవచ్చన్నాడు. ఇక ఈ మ్యాచ్కు ప్రేక్షకులు వస్తుండటం సంతోషం కలిగించే అంశమని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ముందుగా ముంబై ఇండియన్స్ ట్వీట్ చేయగా.. కాపీరైట్ ఇష్యూ కింద ట్విటర్ తొలగించింది. ఆ తర్వాత బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.