For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారని కథనాలు వచ్చిన కాసేపటికే హిట్ మ్యాన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్‌.. వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.

'అందరికీ.. హలో! నా టెస్ట్ క్రికెట్‌ రిటైర్మెంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఇక నేను వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతాను.'అని రోహిత్ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.

Rohit Sharma announces retirement from Test cricket

12 సెంచరీలు..
రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌లో 67 మ్యాచ్‌ల్లో 116 ఇన్నింగ్స్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212. పరిమిత ఓవర్ల తరహాలో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ గొప్పగా సాగలేదు. 2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. తొలి ఇన్నింగ్స్‌లోనే 177 పరుగులు చేశాడు. తన రాకను ఘనంగా చాటుకున్నా.. ఆ జోరు కొనసాగించలేకపోయాడు.

ఓపెనర్‌గా ప్రమోషన్‌తో..
2019లో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకోవడం అతని టెస్ట్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఓపెనర్‌గా తన తొలి సిరీస్‌లోనే సౌతాఫ్రికాపై రోహిత్ శర్మ రెండు సెంచరీలు బాదాడు. ఈ సిరీస్‌లో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 212 పరగులు చేశాడు. ఇది అతనికి ఏకైక టెస్ట్ డబుల్ సెంచరీ. ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ బాదిన రోహిత్.. ఆస్ట్రేలియాలోనూ ఓ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ అనంతరం 2022లో భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్.. జట్టును డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు చేర్చాడు. కానీ టైటిల్ అందించలేకపోయాడు. రోహిత్ సారథ్యంలో భారత్ టెస్ట్ టీమ్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది.

బోర్డర్ గవాస్కర్ వైఫల్యంతో..
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. చివరి టెస్ట్‌కు తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆ సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో రోహిత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తాడని అనుకున్నారు. కానీ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ‌ను తప్పించారని బుధవారం వార్తలు వచ్చాయి.

ఈ కథనాలు వచ్చిన కాసేపటికే రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగానే అతను ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి.. వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలని భావించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తప్పుకోవడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Wednesday, May 7, 2025, 19:45 [IST]
Other articles published on May 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+